Friday, September 30, 2011

ఆదివాసీ ప్రజలపై జరిగిన అకృత్యాలసంచలన తీర్పు - సంపాదకీయం Andhra Jyothi 1/10/2011


సంచలన తీర్పు
- సంపాదకీయం

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా వాచతి ఆదివాసీ ప్రజలపై జరిగిన అకృత్యాల కేసు దాదాపు రెండు దశాబ్దాలకు ఒక కొలిక్కి వచ్చింది. ఆ కేసులో 215 మంది ప్రభుత్వ అధికారులకు శిక్ష విధిస్తూ ధర్మపురి సెషన్స్ కోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. న్యాయస్థానం ఇంతమంది ప్రభుత్వ అధికారులను ఒకేసారి శిక్షించడం చాలా అరుదైన విషయం.

1992లో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కోసం గాలింపులు చేస్తున్న అటవీ, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు ఆదివాసీ గూడేలపై దాడి చేసి అనేక అకృత్యాలకు పాల్పడ్డారు. వాచతి ప్రజలు, తమిళనాడు మానవ హక్కుల సంఘాలు సుదీర్ఘకాలంగా నడుస్తున్న వాచతి కేసును సత్వరం పరిష్కరించాలని ఉద్యమించడంతో జాతీయ మానవహక్కుల కమిషన్ ఈ కేసును పర్యవేక్షించింది.

వీరప్పన్ గంధపు చెక్కల స్మగ్లింగ్‌కు డి ఎంకె రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, బడా వాణిజ్యవేత్తల అండదండలున్నాయి. ముఖ్యంగా అటవీ ప్రాంత గ్రామాల్లో పెద్దఎత్తున విస్తరించిన వన్నియార్ (అగ్నికుల క్షత్రియులు) కులం అండదండలు కూడా వీరప్పన్‌కు ఉంది. వారిని వదలిపెట్టి జయలలిత ప్రభుత్వ ఆదివాసీ ప్రజలపై దాడులకు ఒడిగట్టింది. అకృత్యాలకు పాల్పడిన అధికారులను ఆ ప్రభుత్వం వెనకేసుకొచ్చింది.

స్మగ్లింగ్‌ను అరికట్టే ముసుగులో అధికారులు తమ ఇళ్ళను ధ్వంసం చేశారని, ఆస్తులను గుంజుకున్నారని, పశువులను చంపి వే శారని తమకు న్యాయం చేయాలని వాచతి ప్రజలు అనేక ఉద్యమాలు చేపట్టారు. పర్యవసానంగా 1995లో వాచతి కేసును మద్రాసు హైకోర్టు సిబిఐకి అప్పగించింది. తరతరాలుగా దేశంలోని ఆదివాసుల హక్కులు, ఆస్తులు, ఆవాసాలు పరాయీకరణకు గురవుతూనే ఉన్నాయి.

దాన్ని ప్రతిఘటించిన ప్రతిచోటా రాజ్యం వారిపై తీవ్రంగా విరుచుకపడుతూనే ఉంది. పశ్చిమాన అబూజ్‌మడ్ పర్వత ప్రాంతాలు కావచ్చు, ఈశాన్య రాష్ట్రాలు, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ , ఒరిస్సా రాష్ట్రాల్లోని ఆదివాసీ ప్రాంతాలు కావచ్చు, దక్షిణాది రాష్ట్రాలోని అటవీ ప్రాంతాలు కావచ్చు - దేశంలో ఎక్కడైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల ఉద్యమాలను నిర్ధాక్షిణ్యంగా అణచి వేస్తున్న చరిత్రే.

స్వాతంత్య్రం వచ్చి ఆరున్నర దశాబ్దాలు కావస్తున్నప్పటికీ ఆదివాసుల దయనీయమైన పరిస్థితులలో ఎలాంటి మార్చు చోటు చేసుకోలేదు. వారి సంస్కృతి సంప్రదాయాల సంరక్షణకు ఉద్దేశించి రాజ్యాంగంలో పొందుపరచిన ఆదివాసీ చట్టాలు, హక్కులను ప్రభుత్వాలు ఏళ్ళ తరబడి నిర్లక్ష్యం చేశాయి. ఫలితంగా నాగరిక సమాజాన్ని వారు నమ్మలేని స్థితి ఏర్పడింది. స్వదేశంలోనే పరాయివారుగా న్యూనతా భావంతో బతకాల్సిన దుస్థితి వచ్చింది.

హక్కుల అమలు కోసం, సాధనకోసం రాజ్యాంగ వ్యవస్థలపై ఒత్తిడి చేయాలని వారికి స్పృహ లేకపోవడం సహజం. మోసపూరిత వ్యాపారస్తులు, స్మగ్లర్లు వంటి వారినుంచి సంరక్షించి, వారిలో ఆ స్పృహ పెంపొందించడం ప్రభుత్వాల విధి. అలాంటిది వాచతిలో కంచెలా సంరక్షించాల్సిన ప్రభుత్వమే కాటు వేసింది. వీరప్పన్‌ను పట్టి బంధించాలనుకుంటే అతనికి సహకరించే ఆదివాసులను హింసించాలని ఏ చట్టాలు చెబుతున్నాయి? వీరప్పన్ గంధపు చెక్కల స్మగ్లింగ్ వ్యాపారంలో నైతిక , చట్టబద్ధ అంశాలు వాచతి ఆదివాసీలకు ఏ మాత్రం అర్థమై ఉంటాయి? అర్ధమైనా, అర్ధంకాకపోయినా ఏళ్ళతరబడి నిర్లక్ష్యానికి గురయి, ఉపాధిలేక, కష్టాలు కడగండ్లతో కాలం వెళ్ళదీస్తున్న ఆదివాసులకు గంధకపు చెక్కల స్మగ్లింగ్ కూడు పెడుతుండడంతో వాళ్ళు వీరప్పన్‌కు సహకరించి ఉండొచ్చు.

ఆ ప్రజల దైనందిన జీవిత సమస్యల్ని పరిష్కరించడం ద్వారా ప్రభుత్వాలు వారి జీవితాల్లో వెలుగు నింపండం ద్వారా వారిని గెలుచుకోగలిగితే తాము కోరుకున్నట్లుగా వీరప్పన్ పట్టివేత సులభ సాధ్యమవుతుంది. అలాకాక వీరప్పన్‌కు సహకరిస్తున్న అమాయక ఆదివాసీ ప్రజలను హింసించడం ఏపాటి ప్రజాస్వామికం? దాదాపు ఇరవై మంది మహిళల్ని ట్రక్కులలో సమీపంలోని ఫారె స్టు బంగళాకు తరలించి అధికారులు వారిని చిత్ర హింసలకు గురిచేసి, అత్యాచారాలకు పాల్పడడం సభ్య సమాజం తలదించుకునే చర్య కాదా?

ఆదివాసులపై జరుగుతున్న అనేక అకృత్యాలు కేసులుగా నమోదు కాకుండానే కాలగర్భంలో కలసి పోతున్నాయి. కన్నీటి గాథలుగా వారి మనస్సులలో గాయాలుగా మిగిలిపోతున్నాయి. ప్రజాస్వామిక వాదులు, హక్కుల ఉద్యమకారులు ఏవైనా పెద్ద పెద్ద సంఘటనలను పట్టించుకుని ఉద్యమిస్తున్న సమయంలోనే అవి మీడియా ద్వారా వెలుగుచూస్తున్నాయి.

చాలా కేసులు పోలీసు స్టేషన్ల వరకు వెళ్ళకుండా భయం వల్లనో, ఆశ చూపడం వల్లనో మధ్యలోనే వీగిపోతున్నాయి. ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఒకటుందన్న విషయం ఆదివాసీలకు తెలియకపోవడంలో విడ్డూరం లేదు గాని, ప్రభుత్వ యంత్రాంగం దాన్ని నిర్లక్ష్యం చేయడం అమానుషం. సభ్య సమాజంలో పెద్ద సంచనలం సృష్టించిన ఒకటి రెండు కేసులు కోర్టుల వరకూ వెళ్ళినప్పటికీ న్యాయం జరుగుతుందన్న ఆశలేదు, పైగా తీర్పు కోసం ఏళ్ళ తరబడి ఎదురు చూపులు చూడాలి. కొన్ని సందర్భాల్లో పోలీసు కేసు నమోదు చేసుకోవడానికి పెద్ద పోరాటమే చేయవలసి వస్తుంది.

మన రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలోని జి మాడుగుల మండలంలోని వాకపల్లిలో 11 మంది ఆదివాసీ మహిళలపై మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు జరుపుతున్న గ్రేహౌండ్స్ పోలీసులు 2007లో అత్యాచారం జరిపిన ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటనపై బాధిత ప్రజలు, ప్రజాస్వామికవాదులు, హక్కుల సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించినప్పటికీ, ఇప్పటి వరకు పోలీసు స్టేషన్‌లో కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. పైగా ప్రభుత్వం పోలీసులను సమర్థించింది.

మహిళల ప్రవర్తన పట్ల అనుమానాలను వ్యక్తం చేసి అవమానపరచింది. గ్రే హౌండ్స్ పోలీసులపై కేసుల పెట్టకుండా ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరించింది. వాకపల్లి అకృత్యానికి పాల్పడ్డ పోలీసులపై కేసు నమోదు చేయాలన్న విషయంపై రాష్ట్ర హైకోర్టులో ఇప్పటికీ వ్యాజ్యం నడుస్తోంది. చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే భావంతో నడుస్తున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆదివాసీలకు మినహాయింపు ఉందన్న కఠోర వాస్తవానికి వాకపల్లి సంఘటన ఒక నిదర్శనంగా మిగిలింది.

ఆదివాసీ ప్రాంతాలలోని నీరు, అడవి, భూములు దేశ సహజ వనరుల వాణిజ్యానికి లక్ష్యాలుగా మారాయి. దేశ, విదేశీ కార్పొరేట్ శక్తులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అండదండలతో, దేశంలోని విశాల అటవీ ప్రాంతాలలో పరచుకున్న ఖనిజ సందలను వెలికితీసేందుకు ఆదివాసీలను పెద్దఎత్తున నిర్వాసితులుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. విశాఖ మన్యంలోని 515.89 టన్నుల బాక్సైట్ తవ్వకానికి అడ్డుగా ఉన్న ఆదివాసీలను తొలగించటానికి వాకపల్లి బల్లుగూడలో అత్యాచారం జరిపితే, ఒరిస్సా కందహాల్‌లో నలుగురు ఆదివాసీ మహిళలపై సిఆర్‌పిఎఫ్ జవాన్లు అకృత్యాలకు పాల్పడ్డారు.

మావోయిస్టుల నిర్మూలనకు ఉద్దేశించిన 'గ్రీన్ హంట్' కార్యక్రమంలో భాగంగా దండకారణ్యంలోని ఆదివాసీ ఆవాసాలన్నీ వాకపల్లి, వాచతిలలో జరిగిన తీరులోని అకృత్యాలను నిత్యం భరిస్తూనే ఉన్నాయి. ఏళ్ళతరబడి నాగరిక ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురయిన ఆదివాసీలు ఈనాడు పెద్దఎత్తున జరుగుతున్న కార్పొరేట్ దాష్టీకాన్ని ధిక్కరిస్తున్నారు. తమ వనరులు, ఆవాసాల రక్షణ కోసం ఉద్యమబాట పట్టారు. వాళ్ళకు మార్గదర్శకత్వం వహిస్తోంది మావోయిస్టు శక్తులు కావొచ్చు, కాక పోవచ్చు.

దాంతో అడవిలో శాంతి భద్రతల కోసం ఈ ప్రభుత్వాలు పెద్దఎత్తున భద్రతా దళాలను ఆదివాసీ ప్రాంతాలలో మోహరించాయి. భూగోళంలో తమ వనరులు హక్కుల కోసం ఉద్యమిస్తున్న మూలవాసులు, ఆదివాసుల పట్ల ప్రభుత్వాలన్నీ ఒక్కతీరుగానే ప్రవర్తిస్తున్నాయి. అయితే పౌర ప్రజాస్వామిక ఉద్యమాల కృషి, ఒత్తిడి కారణంగా వెలువడిన 'వాచతి' తీర్పు ఆహ్వానించదగ్గ పరిణామం.

No comments:

Post a Comment