Wednesday, September 7, 2011

ప్రజా ఫ్రంట్ చారిత్రక అవసరం -దుడ్డు ప్రభాకర్ Andhra Jyothi 12/11/2010


ప్రజా ఫ్రంట్ చారిత్రక అవసరం

-దుడ్డు ప్రభాకర్

నా లుగు దశబ్దాలుగా తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడుతూనే ఉన్నారు. ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఒక రాష్ట్ర సాధన కోసం ఇంతటి సుదీర్ఘ పోరాటం జరిగిన చరిత్ర, ఇంతటి నెత్తురు చిందించిన సందర్భం లేదు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ప్రతిసారి పాలకులు అనుసరిస్తున్నది రెండే మార్గాలు. ఒకటి ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని రాజకీయ లబ్ధి పొందడం. రెండు ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేసి తెలంగాణను రక్తసిక్తం చేయడం.

అయితే ఇప్పుడు సరికొత్త మార్గాన్ని ఎన్నుకున్నారు. వారే ఉద్యమకారులుగా అవతారమెత్తి ఉద్యమాలను హైజాక్‌చేసి ఇటు ఉద్యమకారులుగా, అటు రాజకీయ నాయకులుగా ప్రజల ముందు నిలబడడం. హోంమంత్రి చిదంబరం 2009 డిసెంబర్ 9 ప్రకటన, 2010 జనవరి 5న ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీ, శ్రీకృష్ణ కమిటీ నియామకం వెనుక పాలక వర్గాల ఉమ్మడి వ్యూహం అదే. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమాలపై గుళ్ల వర్షం కురిపించిన కాంగ్రెస్, లాబీయింగ్ చేసి తెలంగాణ సాధిస్తామన్న టిఆర్ఎస్, ఒక్క ఓటు-రెండు రాష్ట్రాలు అన్న బిజెపితో సహా అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమాల ద్వారానే తెలంగాణ అంటూ ప్రజా ఉద్యమాలను హైజాక్ చేశాయి.

ఆరు నెలల కిందట తెలంగాణలోని అన్ని ప్రాంతాల ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి తమకు తెలిసిన పద్ధతుల్లో చేసిన నిరసన కార్యక్రమాలు ఇప్పుడు కనుమరుగయ్యాయి. అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని ఉద్యోగ సంఘాలు, కవులు, కళాకారులు, మహిళలు, కార్మికులు ఒక్కొక్క జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి తెలంగాణ అంతటా ధూంధాం చేశారు. రాజకీయ నాయకులను గ్రామా ల్లో నిలదీశారు. వాటిలో కొన్ని జాక్‌లను, ఆ పోరాటాలను పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులంతా కలిసి నిర్మించిన రాజకీయ జాక్ తనలో విలీనం చేసుకుంది. విలీనం కాని వారిని బలహీన పరిచే కుట్రలు చేసింది. ఎట్టకేలకు ప్రజల నాయకత్వాన్ని నిర్జీవం చేశారు.

ఈ పరిస్థితిలో తెలంగాణ ప్రజాఫ్రంట్ ఆవిర్భావం జరిగింది. తెలంగాణలోని వివిధ ప్రజా సంఘాలకు చెందిన వందలాది మంది నాయకులు 'పోరాటాల ద్వారా తెలంగాణ సాధించుకుందాం' అంటూ ఉమ్మడి గొంతుతో నినదించారు. రాజకీయ నాయకులు ఉద్యమకారులుగా, ఉద్యమకారులు రాజకీయ నాయకులు స్వరాలు మారుస్తున్న ప్రస్తుత సందర్భంలో ఉద్యమకారులను, రాజకీయ నాయకులను ఐక్యం చేస్తూ ప్రజాఫ్రంట్ పురుడుపోసుకున్నది. ఫ్రంట్ తన ప్రణాళికను ప్రకటించకముందు, ప్రకటించాక మీడియాలో విస్తృత చర్చ జరిగింది. ఆ సందర్భంగా మీడియా ద్వారా కొందరు చేస్తున్న వక్రీకరణలు, అసత్య ఆరోపణలు ప్రజాస్వామిక ఉద్యమాలకు నష్టదాయకంగా ఉంటున్నాయి.

కొందరు ప్రజాఫ్రంట్‌ను గద్దర్ ఫ్రంట్‌గా ప్రచారం చేస్తున్నారు. అంతటి చారిత్రక బాధ్యత కలిగిన ఫ్రంటుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న గద్దర్ ఛైౖర్మన్‌గా ఉన్నప్పుడు అలాంటి విమర్శలు రావడంలో ఆశ్చర్యంలేదు. కానీ ఆ విమర్శలు చేస్తున్న వారు గౌరవీయ స్థానాల్లో ఉన్న మేధావులు, ఉద్యమకారులుగా గుర్తింపు ఉన్నవారు కావడమే విచారకరం. వారు అంతటితో ఆగలేదు. గద్దర్ ఛైర్మన్‌గా ఉన్నాడు కాబట్టి తెలంగాణ ప్రజాఫ్రంటుకు మావోయిస్టు పార్టీకి సంబంధాలున్నాయి దుష్ప్రచారం చేస్తున్నారు. పోరాట సంస్థలుగా, పార్టీలుగా, ఉద్యమకారులుగా ప్రకటించుకున్నవారు ఇలాంటి ప్రచారంలో రాజ్యం కంటే ఒకడుగు ముందుండడమే వింత.

ఫ్రంట్ ఆవిర్భావ సందర్భంగా జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకులు విమల మాట్లాడుతూ తెలంగాణ ప్రజాఫ్రంట్ ఎన్నికల్లో పాల్గొనాలని పట్టుబట్టింది. 'ఎన్నికలు లేకుండా పార్లమెంటులో బిల్లు ఎలా సాధ్యం అన్నారు. రాజ్యాంగబద్ధ పోరాటమంటే ఎన్నికలు కాక మరేమిటి? ఒకవేళ సాయుధ పోరాటమే చేయదలిస్తే సర్కారును కూల్చడానికి రహస్య ఎజెండా ఏమైనా ఉంటే బయటపెట్టాలని ఆమె మీడియా సాక్షిగా వ్యాఖ్యానించింది.

పాలక వర్గాల గొంతులో బిగ్గరగా అరిచి రాజ్యాన్ని ఫ్రంట్‌పైకి ఉసిగొల్పడం ఉద్యమకారిణిగా చెప్పుకుంటున్న విమలకు, ఆమె బృందానికి తగదు. అనేక పోరాట పురిటిగడ్డ అయిన తెలంగాణ బిడ్డలు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పార్లమెంటరీ రాజకీయాల వెలుపల ఏళ్ల తరబడి పోరాటాలు చేస్తున్నారు. ఆ పోరాటాలలో వందలాది మంది విద్యార్థులు అమరులయ్యారు. ఎన్నికలను-ఉద్యమాలను ఒకే గాటనకట్టి విమల చేసిన వ్యాఖ్యలు అమరుల త్యాగాలను అవహేళన చేసేవిగా ఉన్నాయి. పోరాటాల ద్వారా తెలంగాణ సాధించుకుందాం అని నినదిస్తున్న నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల్ని అపహాస్యం చేసేవిగా ఉన్నాయి.

ఈ దేశంలో పీడిత ప్రజల పోరాటాల ద్వారానే పార్లమెంటులో చట్టాలు చేయబడ్డాయి. అంతేగాని ఆయా ప్రజలు ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారానో, పాలకుల దయాదాక్షిణ్యాల వల్లనో, ప్రేమతోనో చేసినవి కావు. కాబట్టి ఆ చట్టాల అమలు కోసం మళ్లీ పోరాడాల్సి వస్తుంది. ఈ స్టేజిలో ప్రజలుంటే 'ఈ పోరాటాలు సుద్ద దండగ చట్ట సభల్లో మనం స్థానం సంపాదిద్దాం' అని సుళువుగా అనే వారున్నారు. కానీ ఉద్యమాలు చేద్దామంటే 'రహస్య సాయుధ పోరాట ఎజెండా ఏదైనా ఉంటే బయటపెట్టండి' అనే విచిత్ర వాదన ఇప్పుడే వింటున్నాం. అలాంటి ఎన్నికలు-ఉద్యమాలు ఒకటేనని విమల నిర్ధారణకు వచ్చారు. రాజ్యాంగబద్ధ పోరాటమంటే ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రమే కాదు.

ప్రపంచ చరిత్రలో ఇప్పటిదాకా జరిగిన, జరుగుతున్న ఉద్యమాలు అందుకు ఉదాహరణ. ఎన్నికల్లో పోటీకి నిరాకరించిన వాళ్లందరూ మావోయిస్టులు కాదు. స్వాతంత్ర సమరయోధులు కూడా ప్రస్తుత ఎన్నికల జాతరకు వ్యతిరేకంగా ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఒక ప్రాంతీయ అస్తిత్వ ప్రజాస్వామిక ఉద్యమం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే పార్లమెంటులో బిల్లు పెట్టాలి. అందుకు అవసరమయ్యేది ప్రజాస్వామిక ఉద్యమమే. సాయుధ పోరాటం అవసరం లేదు. రాజ్యంగ పరిధిలో చట్టబద్ధంగా ఉద్యమించాలనుకున్నవారు తెలంగాణ ప్రజాఫ్రంట్‌గా ఏర్పడ్డారు. తెలంగాణకు-ఎన్నికలకు-సాయుధ పోరాటానికి లింకు ఎందుకు పెడుతున్నారో వారికే అర్థం కావాలి.

తెలంగాణ విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన తర్వాత మాత్రమే ఢిల్లీ పీఠం కదిలింది. అందులో భాగంగానే డిసెంబర్ ప్రకటన వెలువడిందన్న విషయం తెలంగాణ ఉద్యమకారులందరూ గుర్తించుకోవాల్సిన అవసరముంది. దొరల పీడనకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటాలు చేసి దొరగడీలను ఖాళీ చేయించిన తెలంగాణ ప్రజలకు మళ్లీ వారే దిక్కు అయ్యే పరిస్థితి రాకూడదు. తెలంగాణ సాధనే లక్ష్యంగా ప్రకటించుకున్న ఈ ఫ్రంట్‌ను బలోపేతం చేయాల్సిన బాధ్యత తెలంగాణలోని ప్రతిపౌరునిపై ఉంది.

-దుడ్డు ప్రభాకర్
కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు

No comments:

Post a Comment