Tuesday, September 6, 2011

ఈ జనులు మన మధ్య ఉన్నారా? - వకుళాభరణం కృష్ణమోహన్‌రావు. Andhra Jyothi,06.09.2011


ఈ జనులు మన మధ్య ఉన్నారా?
- వకుళాభరణం కృష్ణమోహన్‌రావు

మీరెప్పుడైనా ఈ కులాల పేర్లు విన్నారా?
బాలసంతు, బహురూపి, బందర, బుడబుక్కల, దొమ్మర, గంగిరెడ్ల వారు, జంగం, జోగి, కావటిపాపల, కొర్చ, మొండివారు, మొండిబండ, బండ, పిచ్చకుంట్ల, వంశరాజ్, పాముల, పార్థి, నీర్ షికారి, పంబాల, దమ్మలి, పెద్దమ్మల వాండ్లు, ఎల్లమ్మ వాండ్లు, ముత్యాల వాండ్లు, వీర ముష్టి, నెత్తికోటల, వీరభద్రీయ, గుడల, కంజరబట్ట, రెడ్డిక, మొండిబట్ట, నొక్కర్, పరికి ముగ్గుల, యాత, చొపమెరి, కైకాడి, మందుల, మేథర్, కూపపులి, పొందర, పట్రా, కురాకుల, సిక్లిగర్, పూసల, కెవ్వుట్లు, గుడియా జక్కల...మరెన్నో. ఇవి బీసీ కులాలని, ఈ కులాలవారు మన రాష్ట్రంలోనే ఉన్నారని ఎందరికి తెలుసు?

ఈ మానవ సమూహాలు మన నాగరిక వ్యవస్థలోనే ఉన్నాయా? అనే అనుమానం కలగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అనంతరామన్ నేతృత్వంలో మొట్టమొదటి బీసీ కమిషన్ 1970లో ఈ కులాలను సంచార, విముక్తి జాతులుగా గుర్తించింది; బీసీ కులాల జాబితాలోని 'ఎ' గ్రూపులో చేర్చింది. వీరి అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించి, జన జీవనస్రవంతిలో తగిన గుర్తింపును తేవాలని సూచించింది. అయితే 64 యేళ్ళ స్వతంత్ర భారతంలో వీరి స్థితిగతులను పరిశీలించడం మొదలుపెడితే అర్థమయ్యేదేమిటి? జాడ తెలియని కులాలుగా, ఇప్పటికీ సంచార జాతులుగానే మిగిలిపోయారనే కాదూ? ఇది చాలా హృదయ విదారకమైన వాస్తవం.

బాలసంతు, బహురూపి కులస్తులు గ్రామీణ ప్రాంతాలలో బహురూప కళల ద్వారా ప్రజలకు వినోదాన్ని కలిగిస్తూ, భిక్షాటనే జీవనాధారంగా జీవించేవారు. కావడికి జోలె వేసుకొని గంట ఊపుతూ సూర్యోదయానికి ముందే నిద్ర లేపేవారు. ఆ పద్ధతిలో గంటను ఊపడం వీరి ప్రత్యేకత. స్థిర నివాసం లేకుండా సంచార జీవితం గడుపుతూ బతుకులీడ్చేవారు. కాలక్రమంలో వీరి వృత్తి కనుమరుగైపోయింది. వీరు నేడు ఏ విధంగా బతుకుతున్నారో తెలియదు. ప్రధానంగా తెలంగాణ జిల్లాలకే పరిమితమై ఉండేవారు.

దొమ్మరి కులస్తుల దొమ్మరి విద్యలు ఒలింపిక్స్ ఆటలతో పోటీ పడుతాయి. వీరు పందుల పెంపకం చేపట్టేవారు. కాలక్రమంలో జీవనాధారం లేక పలువురు పడుపు వృత్తిని ఎంచుకోవాల్సి వచ్చింది. చట్టం దృష్టిలో నేర ప్రవృత్తి అయిన వీరి వ్యాపకం దినదినగండం అవడంతో ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నారో తెలియదు.

గంగిరెడ్ల వారి గురించి అందరికీ తెలుసు; కాని నేడు వీరి జీవితాల గురించి ఎవరికీ తెలియదు. జంగం, జోగి కులాలు భక్తి ఉద్యమాల కాలంలో ఏర్పడ్డాయి. శైవ మత ప్రచారం కోసం జీవితాలను అంకితం చేసి విస్తృతంగా పర్యటించారు. కాలక్రమంలో భిక్షగాళ్ళుగా మారిపోవాల్సి వచ్చింది. ప్రధానంగా కడప జిల్లాలో భిక్షాటన చేస్తూ, సంచార జీవులుగా బతికిన 'బందర' కులస్తులు దొంగలుగా ముద్రవేయబడ్డారు. దీంతో సమాజంలో కలిసిపోలేకపోయారు. బుడబుక్కల కులస్థులు సంచార జీవితంలో యాచక వృత్తినే ప్రధానజీవనాధారంగా జీవించారు.

కాటిపాపల వాళ్ళు శవదహన క్రియలు చేపట్టే వృత్తి నుంచి కూడా దూరం అయ్యారు. సమాజంలో ప్రస్తుతం వీరి జాడ కనిపించడం లేదు. పూసల వాళ్ళు గ్రామీణ ప్రాంతాలలో సామాన్యులకు అందుబాటులో ఉండే చవక ధరల దువ్వెనలు, కొప్పుపిన్నులు, అద్దాలు మొదలైనవి అమ్మి జీవించేవారు. జక్కుల వాళ్ళు సర్కారు జిల్లాలకు పరిమితమైన జనాధిక్యత లేని సామాజిక వర్గం. వీరి పూర్వీకులు భాగవతం తదితర పురాణాలపై కథలు చెబుతూ జీవనోపాధి పొందేవారు. కాలక్రమంలో జనాదరణ తగ్గడంతో బతుకు దెరువు కోసం పడుపు వృత్తిలోకి దిగి జీవితాలను బలి పెట్టుకున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచీకరణ కావడంతో ఇలా ఎన్నో కులాలు నిర్వీర్యమైపోయాయి.

వృత్తి కులాలు, శ్రామిక కులాలు అవకాశాలు లేక చేయూతనిచ్చే వారు కరువై కునారిల్లిపోతున్నాయి. ఎలాంటి అభివృద్ధిని సాధించలేక, ప్రత్యామ్నాయ జీవనోపాధి దొరకక ఈ కులాలవారు పూర్తిగా అస్తిత్వాన్ని కోల్పోయారనడం సత్యదూరం కాదు. ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టక పోవడంతో దారిద్య్రరేఖకు దిగువన జీవించే ప్రజలుగానే కొనసాగుతున్నారు. ఒకనాటి వృత్తులు, వృత్తి ధర్మాలు ఈనాడు అక్కరకు రాకుండాపోయాయి. అయినా మనుషులు బతకాలి కదా! పారిశ్రామికీకరణతో నూతన వ్యాపార ఉత్పత్తులతో లక్షలాది కుటుంబాలు జీవనాధారం కోల్పోయాయి.

పారిశ్రామికీకరణతో అభివృద్ధి సూచీలను ఘనంగా ప్రకటించుకుంటున్నారు. కాని వాటి వల్ల కోట్లాది ప్రజల జీవన ప్రమాణాల విషయంలో దిగజారిన సూచీలు ప్రకటించరెందుకని? ఎవరు, యేయే వృత్తులు కోల్పోయారో ఎలా బతుకుతున్నారో తెలియకుండా వారి అభివృద్ధికి ప్రణాళిక వేయడం ఎలా సాధ్యం? అందువలన ఈ పేద కులాల జీవన స్థితిగతుల గురించి, వారిని అభివృద్ధి పథంలోకి, ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రత్యేక కృషి ఎలా చేయాలో పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది.

విశ్వవిద్యాలయాలు తమ పరిశోధనలను ఈ రంగాలకు విస్తరించకపోతే అవి ఎందుకున్నట్లు? ఎవరికోసం ఉన్నట్లు? పరిశోధనల పేరిట ఏం చేస్తున్నట్టు? మానవీయ, సామాజిక శాస్త్రాల ద్వారా విస్తృతంగా అధ్యయనాలు నిర్వహించి విశ్వవిద్యాలయాలు ఈ కులాల వారి సమస్యలకు పరిష్కారాలు సూచించవలసివుంది. అన్నిటికన్నా మించి జాతీయ ప్రణాళికా సంఘం ప్రత్యేక శ్రద్ధ వహించి సమస్య మూలాల్లోకి వెళ్ళి, అధ్యయనాలు చేయించి, ఆ దిశగా నిధులు కేటాయించి, చర్యలు చేపట్టాలి.

అలాగే ఆయా కుల సంఘాల నాయకత్వం ఎదిగి, తమ కులస్తుల జీవితాలు ఎలా బాగు పడుతాయో క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారాలకై ప్రభుత్వాలకు నివేదించాల్సి ఉంది. నలభై రెండేళ్ళుగా విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పటికీ, ఈ కులాలు మరీ వెనుక బడి, జాడ తెలియకుండా కనుమరుగవడం, ఉనికిని కోల్పోయే పరిస్థితులు నెలకొనడం దిగ్భ్రాంతికరం. ఆధునిక సమాజం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా దూసుకువెళుతున్న ప్రస్తుత తరుణంలో మరింత బాధ్యతాయుతంగా వీరి అభివృద్ధికి ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సి ఉంది.

- వకుళాభరణం కృష్ణమోహన్‌రావు
కేంద్ర ప్రభుత్వ సామాజిక, న్యాయ పరిశోధన సలహా సంఘం సభ్యుడు

No comments:

Post a Comment