Friday, September 30, 2011

కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్‌ By కొడిచర్ల వెంకటయ్య Surya News Paper 1/10/2011


కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్‌
hyd
ప్రజాస్వామ్యంలో పౌరులే నిర్ణేతలు. పాలకులు ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడినప్పుడు ప్రజలు తమ వ్యతిరేకతను బంద్‌లు, హర్తాళ్ళు, ధర్నాల ద్వారా తెలియజేస్తూ పాలకులకు తమ ఆకాంక్షలను గుర్తెరిగిస్తారు. ప్రజా పాలనకు వ్యతిరేకంగా నిర్వహించే నిరసనల కారణంగా పౌర సమాజానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరసనకారులు కార్యాచరణను రూపొందిస్తారు. ప్రజల కోసం చేసే ఎలాంటి కార్యక్రమం అయినా, అదే ప్రజలకు హాని కలుగకూడదు.


స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మా గాంధీ సైతం పర దేశీయులపై శాంతియుతంగానే యుద్ధం ప్రకటించారు. రెండు వందల సంవత్సరాలకు పైబడి దేశాన్ని ఏలుతూ, రవి అస్తమించని బ్రిటిష్‌ తెల్ల దొరల సామ్రాజ్యాన్ని దేశం నుంచి పారద్రోలడానికి గాంధీ ఎంచుకొన్న మార్గం అహింస! దేశ ఔన్నత్యాన్ని, త్యాగ నిరతిని, సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుతూనే పౌరుషాన్ని, వీరత్వాన్ని సైతం శాంతి మార్గం ద్వారానే ఉద్యమాలకు మళ్ళించి దేశ ప్రజలను ఒక్కతాటిపై ఆయన నిలబెట్టాడు. అందుకే గాంధీ కాస్తా మహాత్మా గాంధీ అయ్యాడు. భారత దేశానికి స్వాతంత్య్రం 1947 ఆగస్టు 15న వచ్చిన సుమారు 398 రోజుల తర్వాత, నిజాం ప్రాంతంలో 1946నుంచి జరుగుతున్న తెలంగాణ సాయుధ భూపోరాటం ఒకవైపు, దేశ ఉప ప్రధాని సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ ఒత్తిడి మరో వైపు నిజాం నవాబును తల దించుకునేలా చేశాయి. ఫలితంగా 1948 సెప్టెంబర్‌ 17 న నిజాం నిరంకుశ పాలన అంతమైంది. భారత దేశంలో నిజాం ప్రాంతం విలీనమైంది.

1952లో తెలుగు భాష మాట్లాడేవారంతా ఒకే రాష్ట్రంలో ఉండాలని, దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు కావాలని ఉద్యమించిన పొట్టి శ్రీరాములు ఆ కాంక్షను నెరవేరుస్తూ 1953 అక్టోబర్‌ 1న దేశంలోనే మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణకు కేంద్ర ప్రభుత్వ అంగీకారం, 1956 నవంబర్‌ ఒకటిన తెలుగువారి స్వప్నం ఆంధ్రప్రదేశ్‌ అవతరణ. నిజాం నవాబును రాజప్రముఖ్‌ పదవినుంచి తొలగించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తొలి గవర్నర్‌గా త్రివేది నియామకం జరిగింది. కానీ అప్పటివరకు ఆంధ్ర ప్రాంతాలుగా ఉన్న సిరోంచ, బస్తర్‌, కోరాపుట్‌, మరాట్వాడా, ఔరంగాబాద్‌, ఫర్‌బనీ, నాందేడ్‌, గుల్బర్గా, గంజాం, బళ్ళారి, రాయచూర్‌, ధర్మపురి మొదలైన ప్రాంతాలను మధ్యప్రదేశ్‌, ఒరిస్సా, కర్ణాటక, మహారాష్టల్రలో కలిపారు.

అంతకు ముందు 1955 ఆగస్టు 7న విశాలాంధ్ర కోసం హైదరాబాద్‌ మేయర్‌ నాయకత్వంలో హైదరాబాద్‌నుంచి స్థానిక ప్రతినిధులు కర్నూలు, గుంటూరు, విజయవాడలలో పర్యటించి విశాలాంధ్ర కోసం జనం సమష్ఠిగా పోరాడాలని పిలుపునిచ్చారు. 1955 నవంబర్‌ 12న విశాలాంధ్ర కోసం రెండు ముఖ్యమైన సమావేశాలు జరిగాయి. చారిత్రాత్మకంగా 1955 నవంబర్‌ 24న చార్మినార్‌ వద్ద జరిగిన సభకు రావి నారాయణరెడ్డి అధ్యక్షత వహించగా కాళోజీ నారాయణరావు ప్రారంభోపన్యాసం చేశారు. ఆ సభలో 500 మందికి పెగా ప్రతినిధులు విశాలాంధ్రకోసం ప్రతిన చేశారు. 1955 నవంబర్‌ 22న శాసన సభలో చర్చ అనంతరం జరిగిన ఓటింగ్‌లో 103 మంది విశాలాంధ్రకు అనుకూలంగా ఓట్లు వేయగా, 29 మంది మాత్రమే వ్యతిరేకించారు.

1949 డిసెంబర్‌ 1న తాత్కాలిక ముఖ్యమంత్రిగా వెల్లోడి నియామకం జరిగింది. ఆ సమయంలో కొంతమంది మద్రాస్‌ వారిని పదవులలో నియమించగా వారికి వ్యతిరేకంగా 1952లో ఇడ్లీ, సాంబార్‌ గోబ్యాక్‌ అంటూ చిన్నపాటి ఉద్యమాన్ని నడిపారు. 1952 ఎన్నికల్లో తెలంగాణలోని 98 శాసన సభ స్థానాలలో కేవలం 42 స్థానాల్లో పోటీ చేసిన వామపక్ష కూటమి 36 స్థానాల్లో నెగ్గింది. మరో 10 స్థానాల్లో వారు బలపరచిన అభ్యర్ధులు గెలిచారు. కాంగ్రెస్‌ 98 స్థానాల్లో పోటీ చేసి 41 స్థానాల్లో గెలిచింది (ఇవి కూడా పిడిఎఫ్‌ పోటీ చేయని స్థానాలు). రావి నారాయణ రెడ్డి ఈ ఎన్నికల్లో అత్యధికంగా ఓట్లు సాధించి దేశంలోనే రికార్డు నెలకొల్పారు. ఈ ఎన్నికల్లో గెలిచిన కొండా వెంకట రంగా రెడ్డి ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడగా, సౌమ్యుడైన బూర్గుల రామకృష్ణ రావును ముఖ్యమంత్రిని చేశారు. నాడు ముఖ్యమంత్రి పీఠం దక్కలేదన్న దుగ్ధతో కొండా వెంకటరెడ్డి క్రమంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని తీర్చి దిద్దే ప్రయత్నం చేశారు. దొరల, పటేళ్ళ స్వార్ధ బుద్ధితో సంకుచిత ధోరణితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం నిరుద్యోగ రాజకీయ నాయకులకు ఉపాధిగా మారుతూ వస్తోంది.

1956 ఆంధ్రప్రదేశ్‌ అవతరణ సందర్భంగా 10 సూత్రాలతో పెద్దమనుషుల ఒప్పందం చేసుకున్నారు. అందులో ఉర్దూ భాష ప్రాధాన్యతను, ముల్కీ నిబంధనలను, కేంద్ర వ్యయం, పాలనా వ్యయాన్ని దామాషా పద్ధతి ప్రకారం ఖర్చు చేయాలనీ, తెలంగాణలో మిగిలిన రెవెన్యూను తెలంగాణలోనే ఖర్చు చేయాలనీ, అధికారాలతో కూడిన ప్రాంతీయ అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేయాలనీ, మంత్రి వర్గంలో 60:40గా ఉండాలని, ఒక ప్రాంతంలో ముఖ్యమంత్రి ఉంటే, మరో ప్రాంతంలో ఉప ముఖ్యమంత్రి ఉండాలనీ ఒప్పందంలో రాసుకున్నారు. కానీ ఆ తర్వాత చేసుకున్న బాసలను మరచారు. 1957లో తెలంగాణ ప్రాంత శాసన సభ్యుల పదవీకాలం ముగియడంతో కేవలం తెలంగాణ ప్రాంతానికి మాత్రమే ఎన్నికలు జరిగాయి. తెలంగాణ ప్రాంతంనుంచి ఎన్నికల్లో పాల్గొంటున్న నాటి నాయకులు కానీ, ప్రత్యేక తెలంగాణ వాదానికి పునాదివేసిన కొండా వెంకట రంగారెడ్డి కానీ నాటి ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే ఆనాడే ప్రత్యేక రాష్ట్రం వచ్చేది కాదా?

నిజాం పాలనలో విద్య విషయంలో తెలంగాణ ఎంతో వెనుకబడి ఉంది. ఆ రోజుల్లో ఉర్దూ ప్రాధాన్యతా పాఠశాలలు మాత్రమే ఉండడం ఒకటైతే, తెలంగాణ ప్రాంతంలోని దొరలు బీసీ, ఎస్సీ, ఎస్టీలను పాఠశాలలకు దూరంగా ఉంచారు. ఉపాధ్యాయులను, వైద్యులను అవసరార్ధం (ముల్కీ నిబంధనలు అమలులో ఉన్నప్పటికీ) అనేక వేల మందిని హెచ్చు జీతాలు ఆశచూపి ఇతర ప్రాంతాలనుంచి పిలిపించి స్థానిక జిల్లా, సమితి అధ్యక్షులు భర్తీ చేశారు. నిజాం పాలనలోనే వాణిజ్య వ్యవసాయ సాగుకోసం సీమాంధ్రులనుంచి ఎందరో వ్యవసాయ దారులను, రైతులను తెలంగాణకు రప్పించారు. ఆ క్రమంలో వచ్చినవారే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పూర్వీకులు.
కాలక్రమేణా తెలంగాణలో విద్యార్థులు పెరిగి ఉద్యోగార్ధమై వచ్చేటప్పటికీ చలా వరకు ఉద్యోగాలు అప్పటికే భర్తీ అయ్యేవి. ఈ కారణంగా 1968 అక్టోబర్‌ 10న తెలంగాణ పరిరక్షణ దినాన్ని పాటించారు. కాలక్రమేణా పాల్వంచ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో తెలంగాణ ప్రాంతీయులకు ఉద్యోగాలివ్వాలనే డిమాండ్‌ మొదలైంది.

అనంతరం 1969 జనవరిలో ఖమ్మంలో రవీంద్రనాధ్‌ చేపట్టిన నిరాహార దీక్షతో ఉద్యమం మొదలైంది. 1969 జనవరి 20నుంచి జరిగిన ఆందోళన హింసాయుతంగా మారింది. పోలీసులు కాల్పులు జరిపారు. ఈ పోరాటానికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి యూనియన్‌ జనరల్‌ సెక్రెటరీ మల్లికార్జున్‌ నేతృత్వం వహించారు. అదే సంవత్సరం జనవరి 24న సదాశివ పేటలో జరిగిన కాల్పులకు నిరసనగా గాంధీ వైద్య కళాశాలలో శంకర్‌ అనే విద్యార్థి చనిపోయాడు. అది తెలంగాణ సాధనలో మొదటి బలిదానంగా చరిత్రలో నిలచిపోయింది.

1967లో జరిగిన ఎన్నికల్లో కొండా వెంకట రంగారెడ్డి మేనల్లుడు డా మర్రి చెన్నారెడ్డి హింస, మతవాదం, అధిక ఎన్నికల వ్యయం కారణాలవల్ల హైకోర్టు, సుప్రీం కోర్టులు 6 సంవత్సరాల ఎన్నికల బహిష్కరణ విధించడంతో మంత్రి పదవి కోల్పోయి ఖాళీగా ఉన్న సమయంలోనే అప్పుడే అంకురార్పణ జరుగుతున్న ప్రత్యేక తెలంగాణ వాదానికి మద్దతు పలికి తెలంగాణ ప్రజాసమితిని స్థాపించారు. అనంతరం సాగిన తెలంగాణ ఉద్యమంలో ఎందరో బలిపశువులయ్యారు. దాదాపు 369 మంది విద్యార్ధులు ప్రాణాలర్పించారు. 1971లో ఆయన తన తెలంగాణ ప్రజాసమితిని కాంగ్రెస్‌లో కలిపారు. అనంతర కాలంలో ఇంద్రారెడ్డి, జానారెడ్డి, చిన్నారెడ్డి మొదలైనవారు ప్రత్యేక తెలంగాణకోసం నినదించినా ప్రజలు అంతగా ఆదరించలేదు. 1999లో కేంద్రంలో వాజ్‌పేయి నాయకత్వంలో ఎన్‌డిఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలో ఉత్తరాఖండ్‌, చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. దీంతో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీ అప్పటికే ప్రతిపక్షంలో ఉండి, తెలంగాణ కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీని ఏర్పాటు చేసుకుంది. దీనికి అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ రాజశేఖర రెడ్డి దర్శకత్వం వహించగా, సోనియా గాంధీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

అప్పుడు అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీలో తెలంగాణ ప్రాంతం నుంచి ఎలిమినేటి మాధవరెడ్డి మరణం అనంతరం కీలక వ్యక్తిగా ఎదిగిన ఆనాటి శాసన సభ డిప్యూటీ స్పీకర్‌ కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు తనకు కేబినెట్‌లో మంత్రి పదవి రాలేదనే దుగ్ధతో ప్రత్యేక తెలంగాణ నినాదాన్ని భుజానికికెత్తుకున్నారు. ఈ క్రమంలో 2001 ఏప్రిల్‌ 27న టీఆర్‌ఎస్‌ పార్టీని ప్రకటించిన అనంతరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఆ పార్టీ బోణీ చేయడం ప్రారంభించింది. అనంతరం పెద్దగా ప్రత్యేక రాష్ట్రంకోసం ఉద్యమాలు చేసిన దాఖలాలు లేకున్నా సీమాంధ్రుల మీడియా టీఆర్‌ఎస్‌కు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది. 2004లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని 46 సీట్లలో పోటీచేసి 26 సీట్లలో టీఆర్‌ఎస్‌ గెలిచింది. అనంతరం 10 మంది ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌ను వదలి కాంగ్రెస్‌లో చేరారు. మిగిలిన 16 మందిని రాజీనామా చేయించిన అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 8, టీడీపీ 3, కాంగ్రెస్‌ 5 సీట్లలో గెలుపొందాయి. 2009 ఎన్నికల అనంతరం వైఎస్‌ఆర్‌ మరణంతో కేసీఆర్‌ మరోసారి ఉద్యమాన్ని తెరపైకి తెచ్చే యత్నంలో ఖమ్మంలో చేపట్టిన దీక్ష, విరమణలను మీడియా పెద్ద ఎత్తున ప్రసారం చేయడంతో ప్రజల్లో నిరసన బయలుదేరడం, శ్రీకాంతాచారి మరణం, చిదంబరం ప్రకటనలు, శ్రీకృష్ణ కమిటీ నివేదికలు ఒకదానికొకటి ముడిపడిన సంఘటనలు మన ముందున్నవే.

1956 నుంచి తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నదనేది ఉద్యమకారుల ఆరోపణ. అందుకు అప్పటినుంచి ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుల ప్రమేయం లేదంటారా? తెలంగాణ అభివృద్ధి కాకపోవడానికి సీమాంధ్రులే కారణమవుతే, అప్పటినుంచి ఇప్పటివరకూ ఎన్నికవుతున్న తెలంగాణ ప్రాంత నేతల తాతలు, తండ్రులు, కుమారుల తప్పు లేదంటారా? ఒకవేళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా, ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా ప్రతినిధులే రేపటి తెలంగాణలో సైతం ప్రజాప్రతినిధులనే విషయం ఒప్పుకోక తప్పదు కదా! బంద్‌లు కారణంగా, రోజు కూలీలుగా బతికే నల్లగొండ, పాలమూరు, మెదక్‌, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలనుంచి వచ్చినవారి కష్టాల మాటేమిటి? ఢిల్లీ ఎపీ భవన్‌లో చావబాదిన దళిత సోదరుడి ఘోష ఎవరికైనా పట్టిందా?
65 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో 14 కొత్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి.

వాటిలో పంజాబ్‌- హర్యానా విషయంలో రాష్ట్ర రాజధాని చంఢీగఢ్‌ను మాత్రం ఉమ్మడి రాజధానిగా చేస్తూనే 141 చ.కి.మీ. విస్తీర్ణంతో కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. 60 సంవత్సరాల తెలంగాణ ఉద్యమానికి ఏకైక పరిష్కార మార్గం హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం (20 సంవత్సరాల వరకు), హైదరాబాద్‌ను 10 సంవత్సరాల వరకు ఉమ్మడి రాజధానిగా ఉంచడం. ఇందుకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంకోసం ఉద్యమిస్తున్న పెద్దలు కొంత పట్టు విడుపులకు దిగుతేనే సమస్య పరిష్కారం అవుతుందితప్ప, నేను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళు అనడం మాదిరిగానే ఉంటుంది. 
కొడిచర్ల వెంకటయ్య

No comments:

Post a Comment