Sunday, September 4, 2011

విద్యార్థుల రక్తం చిందని పోరే లేదు ---డా॥ సి. కాశిం


7/10/2011 1:55:25 AM
విద్యార్థుల రక్తం చిందని పోరే లేదు
పుస్తకంలోని పుటలు తిరగేయాల్సిన చోట రక్తం బొట్లుగా బొట్లుగా కారుతున్నది. కమ్మనికలలు వికసించాల్సిన క్యాంపస్‌లో రబ్బరుబుప్లూట్ తగిలిన గాయాలు సల్పుతున్నవి. యవ్వనపు ప్రేమలు కవిత్వం రాయవల్సిన మునివేళ్ళు లాఠీ దెబ్బలకు పగిలి కంకర రాళ్ళ వైపు చూస్తున్నాయి. రాలిపడిన మాంసం ముద్దలు నెరవేరని తెలంగాణ కోసం తలబాదుకుంటున్నాయి. గోరింటాకుతో ఎరుపెక్కిన లేడిస్ హస్టల్ అరచేతులు ముళ్ళ కంచెను ఈడ్చేస్తున్నాయి. బొంగరంతో ఆడిన బాల్యం బాష్పవాయువు గోళాలను ఒడుపుగా అందుకొని శత్రు శిబిరం వైపు విసురుతున్నది. కోడికూతతో నిద్ర లేసిన డప్పు క్యాంపస్‌ను కదం తొక్కిస్తున్నది. సామూహిక గానంలో శత్రువు ఎత్తులు చిత్తవుతున్నాయి. మూడువందల మంది విద్యార్థులు ఆరువందల మంది పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఒకరకంగా క్యాంపస్ సరిహద్ధులలో యుద్దం జరుగుతున్నది. కాలం కత్తులవంతెనపై విద్యార్థులు కవాతు చేస్తున్నారు. ఇది నడుస్తున్న తెలంగాణ.
ఎంత విచిత్రం. తొంభైయొవ దశకమంతా ప్రపంచీకరణ పడగనీడలో గ్లోబల్ ఎండమావుల వెంట పరుగెత్తిన విద్యార్ధులు ఇవ్వాళ తెలంగాణ కోసం త్యాగానికి సిద్ధపడుతున్నారు. ‘దేశానికి కళ్ళు నీవే, కాళ్ళు నీవే అని చెప్పిన చెరబండరాజు కలను నెరవేర్చుతున్నారు. పుస్తకాలను వదిలి తెలంగాణ నినాదాన్ని అందుకుంటున్నారు. క్యాంపస్ చెట్లకింద పోటీ పరీక్షల పుస్తకాలతో కుస్తీపట్టిన వాళ్ళు నడుస్తున్న తెలంగాణ ఉద్యమానికి వ్యూహాలు పన్నుతున్నారు. షకలకబేబీ పాటల్లో తేలియాడిన పిల్లలందరు పొడుస్తున్నా పొద్దు మీద నడుస్తున్న కాలానికి కాపలకాస్తున్నారు. పాఠశాలలే పోరుబాటలుగా కళాశాలలే కదన రంగంగా కదులుతున్నాయి. ఉద్యమాలకు దూరమవుతున్న విద్యార్థులను నిలదీసి తమ చారివూతక బాధ్యతను గుర్తుచేసిన ఘనత తెలంగాణ ఉద్యమానికే దక్కింది. అరవై, డైబై్బయో దశకాలలో నడిచిన ఉజ్వల పోరాటాన్ని ఈ తరానికి గుర్తు చేసింది తెలంగాణ ఉద్యమే.
నిజానికి తెలంగాణ పోరాటంలో విద్యార్థులు ప్రతీ మూలమలుపులో అగ్రబాగాన నిలబడ్డారు. ఒక రకంగా విద్యార్థుల పోరాటం కార్మిక, మేధావి, విద్యార్థుల ఐక్యతకు కూడా తెలంగాణ పోరాటం నిలు నిదర్శనం. 1969 జనవరి, 5 న ఖమ్మం జిల్లా పాల్వంచ ధర్మల్ పవర్ స్టేషన్‌లో ఆంధ్ర ఉద్యోగుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా కృష్ణ అనే దినసరి కార్మికుడు అమరణ నిరహారదీక్షను మొదలు పెట్టాడు. దీని ప్రభావంతో ఖమ్మం పట్టణంలో రవీంవూదనాథ్ అనే విద్యార్థి జనవరి , 9న అమరణదీక్షకు పూనుకున్నాడు. కార్మికుడు మొదలు పెట్టిన ఉద్యమాన్ని విద్యార్థి అందుకున్నాడు. దీనితో తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు ఉప్పెనలా కదిలారు. ఆంధ్రబోర్ఢులన్నింటిని పీకేశారు. ఆంధ్ర బ్యాంకులపై దాడులు చేశారు. ఆంధ్ర అధికారులు ‘గోబ్యాక్ ’ అంటూ అడ్డుకున్నారు. ఇట్లా సమస్త పాలనా రంగమంతా స్తంభించి పోయింది. హైదరాబాద్, శంషాబాద్, సదాశివపేట్ మొదలైన చోట్ల కాల్పులుజరిగాయి. విద్యార్థులు అమరులయ్యారు. కొందరు గాయపడ్డారు. తెలంగాణ కోసం రక్తం ఏరులై పారింది. ఇట్లా 1969 ఉద్యమం కాసు బ్రహ్మానందడ్డి రక్త దాహానికి బలైపోయింది. 370 మంది విద్యార్థుల వేడి నెత్తురు చిందింది. ఈ నెత్తురు తివాచీ మీద నడుచుకుంటూ వెళ్ళిన చెన్నాడ్డి విద్రోహానికి తెలంగాణ ఉద్యమం మోసపోయింది. చాలా రోజుల తర్వాత 1998 లో తెలంగాణ కోసం తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ (టి.ఎస్.ఎఫ్) ఏర్పడినా చంద్రబాబు నిర్భంధ పాలనలో విస్తృతంగా పని చేయలేకపోయింది.
నలభై వసంతాల తర్వాత 2009 లో మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఎజెండా మీదకి దూసుకొచ్చింది. గిరిజనుడి విళ్లంబులా ఆంధ్రపాలక వర్గాల పై దూసుకెళ్లింది.
ఉస్మానియా మూనివర్శిటీ విద్యార్థులు ఉద్యమంలోకి రావడంతో గుణాత్మకమైన మార్పు వచ్చింది.కెసిఆర్ దీక్షకు మద్దతుగా విద్యార్థుల ర్యాలీ మలి దశ ఉద్యమానికి ప్రాణం పోసింది. ఆర్ట్స్ కాలేజీ ముందువిద్యార్థుల దీక్షా శిబిరం వెలసింది. విద్యార్థి ఐక్యకారాచరణ కమిటి (జెఎసి) ఆర్ట్స్ కాలేజీ మొట్ల మీద ఆవిర్బవించింది. డిసెంబర్ 9న చలో అసెంబ్లీ పిలుపునిచ్చిన ఓ యూ జెఏసీ ప్రపంచం చూపును తనవైపుకు తిప్పుకున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వెన్నులో వనుకును పుట్టించిన ఘనత విద్యార్ధులదే. ఒకవైపు కె.సి.ఆర్ ఆమరణ నిరహార దీక్ష, మరోవైపు విద్యార్థి ఉద్యమం తాకిడికి తట్టుకోలాని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిసెంబరు, 9 అర్ధరాత్రి తెలంగాణ ప్రక్రియ ను మొదలుపెడుతామని ప్రకటించాయి. తెలంగాణ చరివూతలో మొదటి సారి కేంద్రం తరుపున తెలంగాణ కు అనుకూలంగా వచ్చిన ప్రకటన ఇదే. ఇది రావటానికి అనేక శక్తులతో పాటు విద్యార్థుల పాత్ర అద్వితీయమైనదనే విషయాన్ని అందరుగమనంలో ఉంచుకోవాలి.
తెలంగాణ ప్రాంతంలో అరుదుగా వచ్చిన విద్యార్థి ఉద్యమాలను ప్రతీ సందర్భంలో కోస్తాంధ్ర పాలక వర్గాలు అణిచివేసాయి. ఈ సందర్భంలో కూడా అదే జరిగింది. 2009 నవంబర్, 21 న ప్రారంభమైన విద్యార్థులు వెన్ను చూపకుండా ముందుకు కదిలారు. తెలంగాణకు వ్యతిరేకంగా డిసెంబరు, 23న ప్రకటనను నిరసిస్తూ లక్షలాది మంది విద్యార్థులతో 2010 జనవరి 3న ఆర్ట్స్ కాలేజీ మెట్ల మీద కనివిని రీతిలో విద్యార్థి గర్జన సభ జరిగింది . తెలంగాణ ప్రజలపై ఈ సభ అద్భుతమైన ప్రభావాన్ని వేసింది. స్వచ్చంధంగా తరలి వచ్చిన విద్యార్థులు తమ తెలంగాణ ఆ కాంక్షను ప్రపంచానికి చాటారు. ఈ సభ కొనసాగింపుగా జనవరి, 18 నుంచి ఫిబ్రవరి 7 న కాకతీయ యూనివర్శిటీ లో విద్యార్ధి పొలికేక ను లక్షలాది విద్యార్థుల సమక్షంలో ఢిల్లీ పాలకులకు విన్పించారు.
ఇట్లా సంవత్సర కాలం ఐక్యమత్యం గా విద్యార్థులందరు పార్టీలకతీతంగతా ఒకటై తెలంగాణ కోసం ఉద్యమించారు. జైలు పాలయ్యారు. లాఠీదెబ్బలు తిన్నారు. కాళ్ళు చేతులు విరగగొట్టునన్నారు. 620 మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ కోసమే తమ యవ్వనపు రక్తనంతా దారపోశారు. ఏముయిందో ఏమోకాని , నెత్తిన పిడుగు పడట్లు 2010 మార్చిన తెలంగాణ విద్యార్థి జాక్‌లో చీలిక వచ్చింది. తెలంగాణ ప్రజలంతా ఎన్నో ఆశలు పెట్టుకున్న విద్యార్థి ఉద్యమం నిట్ట నిలువునా చీలిపోయింది. కళ్ళముందే చెట్టంత బిడ్డ కూలిపోతే తల్లి ఎంతగా దుక్కిస్తుందో, తెలంగాణ ప్రజ అట్లా ఏడ్చింది. ఇలా కావడానికి తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు అందరి పాత్ర ఉంది. కడుపు చించుకుంటే కాళ్ల మీదపడుతుంది.
అయినా నిరాశను తుత్తునీయలు చేస్తు ఈ వ్యాసం రాసే సమయానికి ఆర్ట్స్ కాలేజీ మెట్ల మీద నిలబడి విద్యార్ధి నాయకులు మాట్లాడుతున్నారు. ‘విడిపోయినా మేమంతా కలుస్తున్నాం ’ మహా ఆమరణదీక్షకు పూనుకుంటున్నాం (జూలై11, 2011) తెలంగాణ ఇవ్వండి లేదా మా ప్రాణాలైన తీసుకోండి అంటూ ప్రకటిస్తున్నారు. ఈ సంక్షోభ సమయంలో తెలంగాణ ప్రజలకు ఇదొక పెద్ద ఆశ . ఈ కమిట్‌మెంటును తెలంగాణ వచ్చేవరకు కొనసాగించాలని విద్యార్థులకు తెలంగాణ ప్రజలందరి తరుపున విన్నపం. రాజీనామా లు చేసిన నాయకులు కూడా ప్రజాక్షేవూతంలోకి వచ్చి ఉద్యమాలు చేస్తేనే తెలంగాణ వస్తుందనే సత్యాన్ని ఆ నాయకులకు గుర్తు చేయవలసిన బాధ్యత కూడా విద్యార్థులదే. ఎందుకంటే కోస్తాంధ్ర పెట్టుబడిదారుల డబ్బు సంచులకు అమ్ముడుపోయిన కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని రాజీనామాలకే ఇస్తుందనేది అర్ధసత్యమే.
తెలంగాణ కు గత నలభై ఏళ్ళుగా ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అందుకే ఉద్యమాల ద్వారానే డిసెంబరు 9 ప్రకటన వచ్చిందనే సత్యాన్ని అందరు గ్రహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను స్తంబింప చేసే ఉద్యమాలకు సిద్ధమైతేనే తెలంగాణ ఫలిస్తుంది. తెలంగాణ ఉద్యమం ప్రతీ మూలమలుపులో తమ రక్తాన్ని ధారపోసిన విద్యార్థులు కళ్ళ ముందరి కాలంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని తమ భుజాల మీద మోసి చారివూతక కర్తవ్యాన్ని నెరవేర్చాలి.
డా॥ సి. కాశిం

No comments:

Post a Comment